రాజకీయాలు చేయండి ఎదుర్కొంటాం... ఇలాంటి విషయాల్లోకి వైఎస్ కుటుంబాన్ని లాగితే సహించేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ పెద్దలు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నించారు. సీఎం జగన్ సుపరిపాలనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రతిరోజు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

అసలు, ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీకి ఏమిటి సంబంధం? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇందులో జగన్ కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బంధువులు ఈ లిక్కర్ స్కాంలో సూత్రధారులు అయితే, కావాలనే జగన్ కుటుంబానికి దీన్ని అంటగడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలు చేయండి... ఎదుర్కొంటాం. అంతేకానీ, ఇలాంటి వ్యవహారాల్లోకి వైఎస్ కుటుంబాన్ని లాగితే సహించేది లేదు అంటూ పెద్దిరెడ్డి హెచ్చరించారు.

Peddireddi Ramachandra Reddy
Delhi Liquor Scam
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News